Monday, July 3, 2017

ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది

ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్‌ మార్కెట్స్‌ ఇచ్చే డిస్కౌంట్స్‌. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఈ మాసమే. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యేవి ఇప్పుడే. ఎన్నో పండుగలు మొదలయ్యేది ఈ మాసంలోనే. ఇలా ఎన్నో విశిష్టతలున్న ఆషాఢం గురించి మరిన్ని విశేషాలు మీరూ తెలుసుకోండి.

మన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం ఒక్కో మాసానికి ఒక్కో ప్రత్యేక ఉంది. భారతీయ నెలల పేర్లు చంద్రుని ప్రయాణాన్ని అనుసరించి ఏర్పాటయ్యాయి. చంద్రుడు పూర్వాషాడ, ఉత్తరాషాడ నక్షత్రంలో సంచరిస్తాడు. కాబట్టి ఈ మాసానికి ఆషాఢ మాసం అనే పేరు వచ్చింది. వర్షాలు జన జీవనానికి హర్షం. నీరు అనేది అమృత తుల్యం. నీరు లేనిదే పంటలు పండువు. తిండి ఉండదు. అటు వంటి వర్షాకాలానికి శ్రీకారం చుట్టేది ఆషాఢ మాసమే. ఈ నెల నుంచే వర్షంతో పాటు వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడంతో పాటు దక్షిణ యాణం వర్షాకాలం ప్రారంభం అవుతుంది. అలాగే ఈ నెలలో పాద రక్షలు, గొడుగు, ఉప్పు ధానం చేయాలట. పైగా దక్షిణ యానం పితృ దేవతలకు ప్రీతికరమని అందుకే తర్పణాలు వదిలితే ఎంతో పుణ్యం వస్తుంది.

వధూవరుల వియోగం

పెళ్లయిన నూతన జంటలు ఈ మాసంలో కలిసి ఉండకూదని పెద్దలు చెబుతుంటారు. కొత్తగా పెళ్లయిన కోడలిని పుట్టింటికి పంపుతారు. ఆషాఢ మాసంలో కోడలు గర్భం దాల్చిదే 9 నెలల తర్వాత ఆమె ప్రసవించాల్సి ఉంటుంది. అప్పుడు వేసవి తీవ్రంగా ఉంటుంది. వేసవిలో తల్లీబిడ్డలు ఇబ్బందులు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో కోడల్ని కాపురానికి దూరంగా ఉంచుతారు. అందుకే ఈ నెలలో నూతన వధూవరులకు వియోగం పాటిస్తారు. ఈ విషయాన్ని ప్రధానంగా తీసుకుని కాళిదాసు మేఘసందేశం అనేకావ్యాన్ని రచించారు.

సౌజన్యం: ఈనాడు డాట్ నెట్

Wednesday, November 2, 2016

నాగుల చవితి ప్రాశస్త్యం


దీపావళి అమావాస్య తరువాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థినాడు జరుపుకుంటారు. కొన్నిచోట్ల నాగపంచమి ప్రాచుర్యం పొందితే, కొన్ని ప్రాంతాల ప్రజలు కార్తీక చతుర్థినాడు (నాగుల చవితి) నాగపూజ చేయడం పరిపాటి. స్కందపురాణంలో దీనిని 'శాంతి వ్రతం' అన్నారు.చలికాలం ఆరంభమయ్యే కార్తీకమాసంలో చవితినాడు నాగపూజ చేయడం ఆంధ్రదేశంలో ప్రాచీనకాలం నుంచీ వస్తున్న సంప్రదాయం.

హైందవ సంప్రదాయంలోనే గాక జైన బౌద్ధధర్మాల్లోను నాగారాధనకు ప్రాముఖ్యం ఉంది. అమరావతీ స్తూపంలో ఫణీంద్రుడు పడగవిప్పిన చిత్రాలు ఉన్నాయి. దుర్గాదేవి పరివారంలో ఒక సర్పం కూడా ఉంది. శివుడు నాగభూషణుడు, అతని వింటినారి వాసుకి. శ్రీమహావిష్ణువు మేను వాల్చింది నాగతల్పం పైనే. వినాయకునికి సర్పం ఆభరణం, యజ్ఞోపవీతం కూడా. కుమారస్వామి వాహనమైన మయూరం కాళ్లకు సర్పాలు చుట్టుకొని ఉంటాయి. మహావిష్ణువు చాతుర్మాస్యానంతరం నిద్రలేచే ఉత్థానేకాదశికి ఈ నాగులచవితి దగ్గరగా ఉన్నందున కార్తీక శుద్ధ చవితి నాడే నాగపూజ ఆంధ్రుల ఆచారం. ఆనాడు జ్యోతిర్మండలంలో అనంత శయనాకృతి కనిపిస్తుందని చెబుతారు. '

ఆంధ్రదేశం దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాగరాజుల ఏలుబడిలో ఉన్నట్లు, వారివల్లనే ఈ దేశానికి నాగభూమి అని పేరు ఏర్పడిందని బౌద్ధగాథలు వెల్లడిస్తున్నాయి. సర్పం జాతీయచిహ్నంగా గల ప్రాచీన తెగ నాగులని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఆంధ్రదేశంలో నాగపూజ పరంపరాగతంగా వస్తోంది. శాతవాహనుల నాటి బౌద్ధాచార్యుడు నాగార్జునుని పేరులో నాగశబ్దం ఉంది. నాగవరం, నాగపట్నం, నాగులపాడు మొదలైన గ్రామనామాలు; నాగయ్య, నాగమ్మ వంటి వ్యక్తి నామాలు; నాగులేరు, నాగరం, నాగుల చీర మొదలైన విశేషనామాలు తెలుగునాట ప్రసిద్ధం. అమరావతి స్తూపంలో నాగబు శాసనస్థమైన తొలి తెలుగు మాటగా వేటూరి ప్రభాకరశాస్త్రి గుర్తించారు.

మన పురాణాలలో నాగుల చవితి గురుంచి ఎన్నో గాథలు ఉన్నాయి. దేశమంతట పలు దేవాలయల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుని శివభావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. నాగుల చవితి రోజు ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజచేసి చలిమిడి, చిమ్మిలి (నువ్వులతో చేస్తారు) అరటిపళ్ళు, తాటి బుర్రగుంజు , తేగలు మున్నగున్నవి నివేదన చేస్తారు. సాగరతీరంలో పుట్టలో కోడిగుడ్లను వేయడం ఆచారం. నాగరాజుకు హారతి పట్టడం గాని, వేడి పదార్థాల ఆరగింపు గాని పనికి రాదు.

నాగారాధన ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంది. సర్పం వర్షాధిదేవత అని రెడ్‌ ఇండియన్ల నమ్మకం. రోమన్లు పసాన అనే జాతి సర్పాన్ని సౌభాగ్య దేవతగా పరిగణిస్తారు. యూదులు, అరబ్బులు కూడా పాములను కూపాధిష్ఠాన దేవతలని నమ్మేవారు. అవి నదులను వాగులను ప్రవాహాలతో నింపగలవని విశ్వాసం. సర్పాలు పంటలను కాపాడే దైవాలుగా, నిధి నిక్షేపాలకు రక్షకులుగా కూడా భావిస్తారు.

Saturday, July 11, 2015

తిరుమలలో శంఖనిధి, పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా !


తిరుమలలో శంఖనిధి,పద్మనిధి విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ముందు వారు ఎవరో ముందు తెలుసుకుందాం.శంఖనిధి,పద్మనిధులు శ్రీ వేంకటేశ్వరస్వామివారి సంపదలను, నవనిధులను రక్షించే దేవతలు. ఇందులో ఎడమవైపున అంటే దక్షినదిక్కున ఉన్న రక్షకదేవత పేరు శంఖనిధి,ఇలాగే కుడిప్రక్కన అంటే ఉత్తరదిక్కున ఉన్న రక్షకదేవత పేరు పద్మనిధి . శంఖనిధి రెండు చేతుల్లో రెండు శంఖాలు ధరించివుంటాడు. పద్మనిధి రెండు చేతుల్లో రెండు పద్మాలు ఉంటాయి.

ఇంతకూ వీరు ఎక్కడ ఉన్నారంటారా! తిరుమల శ్రీవారి ఆలయ మహాద్వారానికి ఇరుప్రక్కల ద్వారపాలకులవలె సుమారు రెండడుగుల ఎత్తు పంచలోహవిగ్రహాలు ఉన్నాయి. ఆలయంలోనికి ప్రవేశించేముందు మనం మనకాళ్ళను ప్రక్షాళనచేసుకునే దగ్గర శ్రీవారి ఆలయంగడపకు ఇరుప్రక్కలా కనిపిస్తారు. మనం సాధారణంగా కాళ్ళను కడుక్కునే ఆలోచనలో ఉంటాము.కాబట్టి వారిని గమనించే అవకాశం తక్కువగా ఉంటుంది.దానికి తోడు ఎంతోసేపు ఎదురుచూసిన ఆలయప్రవేశం ఆనందంలో కూడా గమనించం.

ఈ నిధిదేవతల పాదాలవద్ద ఆరంగుళాల పరిమాణంగల రాజవిగ్రహం నమస్కార భంగిమలో నిల్చొని ఉండడం గమనించవచ్చు. ఈ విగ్రహం విజయనగర రాజైన అచ్యుతదేవరాయలది. బహుశా అచ్యుతరాయలే ఈ నిధిదేవతలను ప్రతిష్టించి ఉంటాడనవచ్చు.

ఆగమ శాస్త్రం ప్రకారం సాధారణంగా ఈ నిధి దేవతలను ఆలయానికి మూడవ ప్రాకార ప్రవేశద్వారంవద్ద ఏర్పాటు చెయ్యడం సంప్రదాయం. దీన్ని బట్టి తిరుమల ఆలయం మూడుప్రాకారాలు కలిగిన ఆలయమని తెలుస్తోంది.

ఇంతకు ముందు వీరిని మీరు గమనించివుండకపోతే ఈసారి శ్రీవారిదర్శనంకు వెళ్ళినప్పుడు గమనించి నమస్కరించి ఆలయంలో ప్రవేశించండి.

Sunday, August 5, 2012

ఆంధ్ర భోజుడు: శ్రీ కృష్ణదేవ రాయలు

శ్రీ కృష్ణదేవ రాయలు అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి. ఈయన పాలనలో సామ్రాజ్యము అత్యున్నతస్థితికి చేరుకున్నది. కృష్ణరాయలను తెలుగు మరియు కన్నడ ప్రజలు భారతదేశాన్ని పాలించిన గొప్ప చక్రవర్తులలో ఒకడిగా అభిమానిస్తారు. సాహిత్యములో ఈయన ఆంధ్ర భోజునిగా మరియు కన్నడ రాజ్య రమా రమణ గా కీర్తించబడినాడు. ఈయన పాలనను గురించిన సమాచారము పోర్చుగీసు సందర్శకులు డొమింగో పేస్ మరియు న్యూనిజ్‌ ల రచనల వలన తెలియుచున్నది. రాయలకు ప్రధాన మంత్రి తిమ్మరుసు. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్ఠించడానికి తిమ్మరుసు చాలా దోహదపదడినాడు. కృష్ణరాయలు తిమ్మరుసును పితృసమానునిగా గౌరవించి "అప్పాజీ" (తండ్రిగారు) అని పిలిచేవాడు.

కృష్ణదేవ రాయలు, తుళువ నరస నాయకుడు, నాగలాంబల (తెలుగు ఆడపడుచు) కుమారుడు. ఇతను ఇరవై సంవత్సరాల వయసులో ఫిబ్రవరి 4, 1509న విజయనగర రత్నసింహాసనాన్ని అధిష్ఠించినాడు. ఇతని పట్టాభిషేకానికి అడ్డుగానున్న అచ్యుత రాయలు నూ, వీర నరసింహ రాయలునూ, అనుచరులనూ తిమ్మరుసు సుదూరంలో ఉన్న దుర్గములలో బంధించినాడు.

రాయలు విజయనగరాధీశులందరిలోకీ చాలా గొప్పవాడు, గొప్ప రాజనీతిజ్ఞుడు, సైనికాధికారి, భుజబల సంపన్నుడు, ఆర్ధిక వేత్త, మత సహనము కలవాడు, వ్యూహ నిపుణుడు, పట్టిన పట్టు విడువని వాడు, కవి పోషకుడు, రాజ్య నిర్మాత మొదలగున్న సుగుణాలు కలవాడు. ఇతను దక్షిణ భారతదేశం మొత్తం ఆక్రమించినాడు.

సంస్కృత సాహిత్యంలో కవిపండిత పోషకుడు భోజ రాజు ఉన్నాడు. తెలుగులో ఆయనంతటి వాడు ఆయనే అనే భావనతో ఆయనను ఆంధ్ర భోజుడు అని పిలిచేవారు. భోజరాజు ముఖం చూస్తే ఎలాంటి వాడికైనా కవిత్వం వస్తుందని అనేవారు. అలాగే దక్షిణాదిలో ఆయన సముఖానికి వచ్చి సాహిత్యాన్ని పాండి త్యాన్ని ప్రదర్శించి బహుమానాలు అందుకున్న వారెందరో ఉన్నారు. రణరంగంలో వీరవిజృంభణ చేసిన విధంగానే సాహిత్యరంగంలోనూ విజృంభణ చేసిన ఘనత ఆయనకు ఉంది.

కృష్ణదేవరాయలు స్వయంగా కవిపండితుడు కావడంతో ఇతనికి సాహితీ సమరాంగణ సార్వభౌముడు అని బిరుదు. ఈయన స్వయంగా సంస్కృతంలో జాంబవతీ కళ్యాణము, తెలుగులో ఆముక్తమాల్యద లేక గోదాదేవి కథ అనే గ్రంథాన్ని రచించాడు.
తెలుగదేల యన్న దేశంబు తెలుగేను
తెలుగు రేడ నేను తెలుగొకొండ
ఎల్ల జనులు వినగ ఎరుగవే బాసాడి
దేశభాష లందు తెలుగు లెస్స
అన్న పలుకులు రాయలు రాసినవే! రాయల ఆస్థానమునకు భువన విజయము అని పేరు. భువనవిజయము లో అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, మాదయ్యగారి మల్లన (కందుకూరి రుద్రకవి), అయ్యలరాజు రామభద్రుడు, పింగళి సూరన, రామరాజభూషణుడు (భట్టుమూర్తి), తెనాలి రామకృష్ణుడు అనే ఎనిమిది మంది కవులు ఉండేవారని ప్రతీతి. వీరు అష్టదిగ్గజములు గా ప్రఖ్యాతి పొందారు.

Saturday, July 7, 2012

కూచిపూడి నృత్యము

కూచిపూడి నృత్యము, ఈ పేరు వినని తెలుగు కళాకారుడు ఉండడు. ఇది భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది. కూచిపూడి భాగవతుల ప్రదర్శనలకు నోచుకోని గ్రామం తెలుగునాట లేదు.
కూచిపూడి నృత్యరీతికి ఆద్యుడు
- సిద్దేంద్ర యోగి

ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో మచిలీపట్నంకు 15 మైళ్ళ దూరంలో కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. కూచిపూడి గ్రామానికి గొప్ప చరిత్ర ఉంది. తన పదాలతో దక్షిణ దేశాన్నంతా సుసంపన్నం చేసిన క్షేత్రయ్య స్వగ్రామమైన మువ్వ గ్రామంలో 500 సంవత్సరాలకు పూర్వమే నాట్య కళకు అంకురార్పణ జరిగినట్లు చారిత్రాకాధారాలున్నాయి.

ఇది ప్రాచీన ఆంధ్ర చరిత్రాత్మక నగరమైన (క్రీ పూ 2వ శతాబ్దం) శ్రీకాకుళంకు ఆరు మైళ్ళ దూరంలో ఉన్నది. శాతవాహనులు ఈ కళకు గొప్ప ఆరాధకులుగా ప్రసిద్ధి గాంచారు. అప్పట్లో అత్యంత పవిత్ర దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీలు రాజమర్యాదలు అందుకునేవారు. ఇక్కడ లభ్యమైన శిల్పాలు కూడా ఆ నృత్య కళాకారిణుల దైవపూజగా భావించే అపురూప భంగిమలను దాచిపెట్టినట్లు కనిపిస్తాయి. చాలాకాలం వరకు కూచిపూడి నృత్యం దేవాలయాల్లో ప్రదర్శింపబడేది.

ఇందుకు ఆధారం 1502నాటి మచ్చుపల్లి కైఫీయతు. 16వ శతాబ్దం చివరి భాగం నుండీ ఈనాటి వరకూ పారిజాతాపహరణాన్ని ప్రదర్శిస్తూ ప్రశంశలు అందుకొంటున్నారు. గోల్కొండ నవాబు అబ్దుల్ హసన్ తానీషా 1687లో కూచిపూడి కళాకారులకు కూచిపూడి గ్రామాన్ని అగ్రహారంగా దానమిచ్చాడు.

సాంప్రదాయం ప్రకారం, పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్నిచేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారు. 15 వ శతాబ్దంలో సిద్దేంద్ర యోగి, తన నాత్య గీతాభినయాలను కూచిపూడి కళాకారులకు అంకితం చేశాడు. కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి దానిని పరిపుష్టం గావించాడు. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరించి, సంస్కరించారు. కూచిపూడి మూడు నిధులుగా ప్రజ్వరిల్లే గొప్ప రీతి. కలాపానికి వెంపటి వెంకట నారాయణ, యక్షగానాలకు చింతా వెంకటరామయ్య, కేళికలకు వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి గార్లు ప్రఖ్యాతి గడించి వాటిని బాగా అభివృద్ధి చేశారు.

కూచిపూడి నృత్యప్రదర్శన గణేష స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఇది భరతుని 'నాట్య శాస్త్రాన్ని' ఉల్లంఘించదు. చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, మూకాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్ధండులు. కృష్ణుని భార్య, సత్యభామ ను అనుకరిస్తూ చేసే నాట్యం భామాకలాపం. ఒక ఇత్తడి పళ్ళెంపై పాదాల నుంచి, నాట్యం చేయడాన్నితరంగం అంటారు. ప్రక్కన ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలిలో కీర్తనలను పాడతాడు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు వంటి వాద్యపరికరాలను ఉపయోగిస్తారు.

వెంపటి చినసత్యం నృత్యరూపకాలకు కొత్త వాతావరణం కల్పించి సామూహిక నృత్యాలకు శుభ్రంగా అన్ని రూపాలలో మిళితంకాగల నృత్య భూమికను స్థిరం చేశారు. దేవదానవ మూర్తులకు, స్వయంవర శోభనలకు, వీరశైవులకు గల అభినయ దృశ్యాలను ఉదేగభరితం చేశారు. 1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడెమీని స్థాఫించారు. అనేక నృత్యరూపకాలను రచింపజేసి, నృత్య దర్శకత్వం వహించారు. శ్రీ కృష్ణ పారిజాతం, చండాలిక, మేనకా విశ్వామిత్ర, రుక్మిణీ కల్యాణం, కిరాతార్జునీయం మొద్లగు నృత్య నాటాలు ఈయన దర్శకత్వంలో పేరెన్నికగన్నవి. వైజయంతిమాల, హెమమాలిని, మంజుభార్గవి, చంద్రకళ, రత్నపాప, పద్మామీనన్, ప్రభా రమేష్ వంటి వారంతా వారి శిష్యులే. భారతీయ సంప్రదాయ నృత్య కళలలో నేడు కూచిపూడి నాట్యం గురించి తెలీని స్వదేశీయులు లేరు. విదేశీయులని సైతం ఆకర్షించిన ఈ నృత్య రీతి అనేకమంది విదేశీ కళాకారులకు సువర్ణ గవాక్షాలను తెరిచింది. విదేశాలలో అంతులేని ఆదరణను పొందింది.

Friday, October 7, 2011

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం

పూర్వం మన దేశంలోని అడవుల్లో వాతాపి, ఇల్వలుడు అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ వుండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు. పాపం వాళ్ళు ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాక అతిథుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు. ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్ఠుగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "వాతాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా " అని పిలిచేవాడు. అతిథుల కడుపులో మాంసరూపంలో ఉన్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు . పాపం! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిథుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగేవాడు.అగస్త్యుడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.

మహర్షిని చూడగానే ఇల్వలుడు ఇల్లు చేరుకోగానే వినయంగా చేతులు కట్టుకుని, "మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా!

ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా " జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం " అనుకున్నాడు.

అది ఇల్వలుడికి వినపడలేదు.

ఆయన చెయ్యి కడుక్కోటానికి లేచి నిలబడగానే ఇల్వలుడు "వాతాపీ! ఓ వాతాపీ! బయటకు రా! " అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది.

అగస్త్యుడు చిరునవ్వు నవ్వుతూ "ఏ వాతాపిని నాయనా నువ్వు పిలుస్తున్నావు? నీ తమ్ముడే అయితే అతను ఎప్పుడో నా పొట్టలో జీర్ణమైపోయాడు" అన్నాడు. తన ఎదుట ఉన్నది అగస్త్యులవారనీ, ఆయనకు మహత్తరశక్తులు ఉన్నాయనీ అప్పుడు అర్థమయింది ఇల్వలుడికి, ఒణికిపోతూ మహర్షి కాళ్ళమీద పడి "మహాత్మా! దయచేసి నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి. మరెప్పుడూ ఇటువంటి పాపం చెయ్యను" అన్నాడు.

తాపసి దయతలచి సరే అన్నాడు.

ఇల్వలుడు మరెప్పుడూ ఎవర్నీ చంపనని ప్రమాణం చేసి, ఆ అడివి వదలిపెట్టి వెళ్ళిపోయాడు.

Sunday, August 14, 2011

నా జన్మభూమి ఎంత అందమైన దేశము

నా జన్మభూమి ఎంత అందమైన దేశము
నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము
నా సామిరంగా హాయ్ హాయ్
నా సామిరంగా
నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు
పచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం
హాయ్ హాయ్ నా సామిరంగా
హాయ్ హాయ్ నా సామిరంగా
బతకాలందరు దేశంకోసమే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే
స్వార్థమూ వంచన లేనిదే పుణ్యము
త్యాగమూ రాగమూ మిళితమే ధన్యమూ
హాయ్ హాయ్ నా సామిరంగా
నా సామిరంగా హాయ్ హాయ్ నా సామిరంగా

రచన: ఆరుద్ర
పాడిన వారు : ఘంటసాల
సంగీతం - ఎం. ఎస్. విశ్వనాధం
సినిమా - సిపాయి చిన్నయ్య (1969)

ఆషాడంలో నవ వధూవరుల వియోగానికి కారణం ఉంది

ఆషాఢం అనగానే ఈ కాలం వారికి గుర్తొచ్చే విషయం క్లాత్‌ మార్కెట్స్‌ ఇచ్చే డిస్కౌంట్స్‌. ఈ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. వర్షాకాలానికి శ్రీకారం చ...